ప్రథమ వర్ధంతి · గ్రంథ ఆవిష్కరణ
వైభవంగా స్వేచ్ఛాకవితా పిపాసి ఆచార్య మాదిరాజు రంగారావు ప్రథమ వర్ధంతి సభ..!!
హోటల్ గ్రీన్ పార్క్, బేగంపేట, హైదరాబాద్ · శనివారం, జులై 11, 2026
లైవ్ రిపోర్టింగ్
ఎ. రజాహుస్సేన్
శనివారం సాయంత్రం విశ్వనాథపీఠం, హైదరాబాద్, ఆచార్య మాదిరాజు రంగారావు “రసధుని” సాహితీ పరిషత్తు సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ కవి, విమర్శకులు ఆచార్య మాదిరాజు రంగారావుగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రచురించిన “సాహితీ వైజయంతి”, స్వేచ్ఛా కవిత్వం (11 సంపుటాలు), సాహిత్య విమర్శ (2 సంపుటాలు) ఆవిష్కరణ సందర్భంగా బేగంపేట గ్రీన్ పార్క్ హోటల్లో వైభవంగా సభ జరిగింది. సభలో మాదిరాజు రంగారావుగారి పుస్తకాలను ఆవిష్కరించారు.
డాక్టర్ సంతోష్ కుమార్
ఆచార్య మాదిరాజు రంగారావు గారి కుమారులు · ప్రారంభోపన్యాసం
ఈ సందర్భంగా మాదిరాజు రంగారావుగారి కుమారులు డాక్టర్ సంతోష్ కుమార్ ప్రారంభోపన్యాసం చేశారు. తమ తండ్రిగారి పేర “ఆచార్య మాదిరాజు రంగారావు రసధుని” సాహితీపీఠాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ పీఠం తరపున ప్రతీ సంవత్సరం సాహితీవేత్తలకు, కవులకు పురస్కారాలను అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే విద్యార్థులకు కూడా సాహితీ కార్యక్రమాలను ఏర్పాటుచేయనున్నట్లు తెలియజేశారు.
వెల్చాల కొండలరావు
అధ్యక్షులు, విశ్వనాథ సాహిత్య పీఠం · సభాధ్యక్షత
సభకు అధ్యక్షత వహించిన వెల్చాల కొండలరావు మాట్లాడుతూ, మాదిరాజు రంగారావుగారి స్వేచ్ఛాకవిత్వం గురించి వివరించారు. అలాగే రంగారావుగారి నిలువెత్తు వ్యక్తిత్వాన్ని కళ్ళముందు నిలిపారు.
ప్రతి కవీ నీతి కొరకే రాస్తాడు. అది రాయడానికి ఒక రీతిని అవలంబిస్తాడు. మరి రంగారావుగారి నీతి ఏమిటి? నాకర్థమైనంత వరకు అది ప్రధానంగా మానవీయత. మానవీయ విలువల కొరకే అందరూ రాస్తారు. మానవీయ విలువల పెంపుదల కోసం, మెరుగుదల కోసం రంగారావు రచనలు చేశారన్నారు.
రంగారావుగారు రచించిన అన్ని గ్రంథాలలో ప్రధానంగా వీటి గురించే ప్రస్తావిస్తారు. ఒకవిధంగా ఈ రచనలన్నీ కలిస్తే మానవీయతా చరిత్రే అవుతుంది. ఆయన చరిత్రను అలా ఇతరులు రాసినట్లుగా కాక సరికొత్తగా రాశారన్నారు. అది అందరికీ, అన్ని దేశాలకూ, అన్ని కాలాలకు పనికొచ్చే చరిత్రే. ఆ విధంగా ఆయన గత చరిత్రలన్నిటికీ కలిపి ఒకే పేరు పెట్టినట్టే కదా! అది ఒకవిధంగా ఇన్వెన్షనే, ఇన్నొవేషనే — చరిత్రకు మరోపేరు పెట్టడం. దానికి రంగారావుగారే ఆద్యుడన్నారు.
ఆయన రాసిన స్వేచ్ఛాకవిత్వం ఇంగ్లీషులో Verse Libre, Prose Poetry, Blank Verse అంటారు. కవిత్వం రాయడం ఎన్నో విధాలు. పూర్వ కవితలన్నీ ఎక్కువ శ్లోకాలకు, పద్యాలకు, పాటలకు, గేయాలకు చెందినవే. వాటికన్నిటికీ అనేకానేక నిబంధనలు, నియమాలు నిర్దేశించారన్నారు. అందుకే వారు ‘ఇన్వెంటర్’, ‘ఇన్నోవేటర్’. ప్రతీదీ క్రొత్తగా, సరిక్రొత్తగా ఆలోచించేవారన్నారు.
తాను చదివినంత వరకు రంగారావుగారి భాషలో ఎన్నో కొత్త కొత్త పదాలు, పదబంధాలున్నాయి — అవి ఆయన సృష్టించినవే. నన్నడిగితే ఆయన భాష ఆయనదే అన్నారు. అలాగే ఆయన భావం కూడా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే, అది తాత్త్విక దార్శనిక ఆత్మిక కోవకు చెందిందన్నారు.
అనుమాండ్ల భూమయ్య
ముఖ్య అతిథి · రంగారావు గారి శిష్యులు
ముఖ్య అతిథి, రంగారావు గారి శిష్యులు అనుమాండ్ల భూమయ్య మాట్లాడుతూ, మాదిరాజుగారి విమర్శా బోధన అద్భుతంగా వుండేదన్నారు. రంగారావుగారు తరగతి గదిలో పాఠం చెప్పేటప్పుడు విద్యార్థులు తన్మయత్వం పొందేవారన్నారు.
ఆయన రాసిన తెలంగాణ స్వరం ఆంగ్లంలోకి అనువాదమైందన్నారు. పద్యాన్ని అలవోకగా రాయడం కాదు — అందంగా, మధురంగా పాడేవారని తెలిపారు. ప్రస్తుతం ప్రచురించిన ఆయన సమగ్ర సాహిత్యాన్ని చూస్తే మాదిరాజు నిత్య యువకులుగా కనిపిస్తారన్నారు!
కోవెల సుప్రసన్నాచార్య
ప్రముఖ కవి, విమర్శకులు
ప్రముఖ కవి, విమర్శకులు, పెద్దలు కోవెల సుప్రసన్నాచార్య గారు మాట్లాడుతూ, మాదిరాజువారి “స్వేచ్ఛా కవిత్వం” గురించి వివరించారు. ఇది కొత్త యుగం. స్వేచ్ఛా సమ నవం. ప్రజాస్వామ్య, సామ్యవాద దార్శనికంతో కాలం గడిచే కొద్దీ స్వేచ్ఛా నవనవంగా విలసిల్లుతూంది. ఇది వచన కవిత్వం కాదు. డెబ్భై యేళ్ళ నుండి రాస్తున్నది ఈ పేరుతో రూఢమైంది — “స్వేచ్ఛా కవిత్వం” అన్నారు.
ప్రకృతిలోని అంశాలను ప్రతీకలుగా భావించి స్వేచ్ఛా కవిత్వం రాశారన్నారు. రాశిలోను వాసిలోను ఎన్నదగిన కవిత్వం రాశారని తెలిపారు. పద్యం రాయడంకంటే మరో కొత్త మార్గం ఎంచుకొని, దానికి స్వేచ్ఛా కవిత్వమని నామకరణం చేశారన్నారు.
జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి
పూర్వ ప్రధాన న్యాయమూర్తి
పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి మాట్లాడుతూ, ఇన్ని పుస్తకాలు రాయడం ఒక్క రంగారావుగారికే చెల్లిందన్నారు. ఆయన అన్ని వస్తువుల్ని, అందరు కవుల కవిత్వాన్ని విమర్శించడం గొప్ప విషయమన్నారు. ఆయన సాహిత్యంలో మానవ విశ్లేషణ కూడా వుందన్నారు.
జస్టిస్ మంగరి రాజేందర్ (జింబో)
పూర్వ న్యాయమూర్తి · రచయిత
జస్టిస్ మంగరి రాజేందర్ (జింబో) మాట్లాడుతూ, మాదిరాజుగారిని జీవితకాలంలో కలవలేకపోవడం విచారంగా, కొరతగా వుందన్నారు. రంగారావుగారు తన గురించి పట్టించుకోకుండా, రుషిలా తన పని తాను చేసుకుంటూ పోయారన్నారు.
కవిత్వం ఓ పుష్పక విమానం — ఎంతమంది కవులొచ్చినా కవితాలోకంలో చోటుంటుందని ఆయన అనేవారన్నారు. విమర్శకులు పట్టించుకోకపోయినా రంగారావు గారు తన పని తాను చేసుకుంటూ పోయారని చెప్పారు.
పి. విజయబాబు
పాత్రికేయుడు
పాత్రికేయుడు పి. విజయబాబు మాట్లాడుతూ, ఆచార్య మాదిరాజు రంగారావుగారి రచనలను పరిచయం చేశారు. కవిగా, రచయితగా 170 పుస్తకాలను వెలువరించడం చిన్న విషయం కాదన్నారు.
విశ్వనాథ రామాయణ కల్పవృక్షంపై రంగారావుగారు విమర్శించిన తీరు నభూతో నభవిష్యతి అన్నారు. ప్రాచీనతను, ఆధునికతను మేళవించిన సాహితీవేత్త రంగారావుగారన్నారు. వారి పుస్తక ముద్రణలు విస్తరించాలన్నారు.
హాస్యబ్రహ్మ శంకరనారాయణ
హాస్య రచయిత
హాస్యబ్రహ్మ శంకరనారాయణ మాట్లాడుతూ, మాదిరాజు రంగారావు అతివాది కాదు, మితవాది కాదు — హితవాది అన్నారు. మాదిరాజు రంగారావు కవిత్వంలో మానవీయత గొప్పదన్నారు.
డాక్టర్ ఏల్చూరి మురళీధర్ రావు
పండితులు
డాక్టర్ ఏల్చూరి మురళీధర్ రావు మాట్లాడుతూ, మాదిరాజు గారి పుస్తకాలను ముద్రించిన వారి కుమారుడు, కుమార్తెలు తండ్రి రుణం తీర్చుకున్నారన్నారు.
ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి
సాహితీవేత్త
ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, మాదిరాజు రంగారావుగారి కవిత్వం విశ్వజనీనమైందన్నారు. రంగారావుగారితో తనకున్న సాన్నిహిత్యాన్ని తెలిపారు.
రంగారావు గారి సాహిత్య విశిష్టతను తెలియజేసిన ఇతర ప్రముఖులు
సభ ఆద్యంతం మాదిరాజు రంగారావుగారి సాహిత్యం పరిమళించింది.
సభను ఆచార్య కె. యాదగిరి సమర్ధంగా నడిపారు.

